● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో కేసుల పరిష్కారం జరుగుతోందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వం–దేశం కోసం అనే అంశంపై న్యాయమూర్తులు, న్యాయవాదులతో శనివారం చర్చించారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్బౌన్స్ తదితర కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణ నుంచి పూల్బాగ్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి, మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. 90 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని, మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం కోర్టు ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


