గంట్యాడ: మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన రంధి దేవుడమ్మ (56) చెరువులో పడి మృతిచెందింది. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రించిన ఆమె మంగళవారం ఉదయం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా గ్రామంలోని చంద్రాజీ చెరువులో మృతదేహమై కనిపించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అనారోగ్య కారణాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, లేదా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మ్యాక్సీ క్యాబ్ ఢీకొని వ్యక్తి మృతి
బలిజిపేట: మండలకేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెర్లాం మండలం ఆమిటి గ్రామానికి చెందిన మరడాన అప్పలస్వామి(52) మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై రమణ కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ఏఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలం ఆమిటి గ్రామానికి చెందిన అప్పలస్వామి వ్యవసాయ పని నిమిత్తం గాబుమందు కొనేందుకు తన ద్విచక్రవాహనంపై బలిజిపేట వచ్చి కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నాడు. అదే సమయంలో బలిజిపేట వైపు కొబ్బరి బొండాల లోడుతో టాటా మ్యాజిక్ మ్యాక్సీ క్యాబ్ వస్తోంది. ఈ క్రమంలో గొల్లవీధి మలుపువద్ద మ్యాక్సీ క్యాబ్ అప్పలస్వామి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో కాళ్లు విరిగి, తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవకర్ కె.జనార్దన్ను అదుపులోకి తీసుకున్నామని ఏఎస్సై చెప్పారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
● మరో యువకుడికి గాయాలు
పార్వతీపురం రూరల్: నూతన దుకాణానికి బోర్డు అమర్చుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన పార్వతీపురం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. పట్టణంలోని సుదర్శన్ షాపింగ్ మాల్ ఎదురుగా కొత్తగా ఒక దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ దుకాణం పేరుతో ఉన్న బోర్డును ఇద్దరు యువకులు భవనం పైనుంచి కిందకు దించుతూ అమర్చే పని చేపట్టారు.ఈ క్రమంలో వారు పట్టుకున్న బోర్డు ప్రమాదవశాత్తు భవనం ఎదురుగా వెళ్తున్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి పురోహిత్ ముఖేష్ కుమార్ (23) అనే యువకుడు తీవ్రంగా షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ముఖేష్తో పాటు బోర్డును పట్టుకున్న మరో యువకుడికి సైతం గాయాలు కావడంతో, గమనించిన స్థానికులు వెంటనే పార్వతీపురం ప్రభుత్వ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఈ ఇద్దరు యువకులను రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మార్వాడీలుగా గుర్తించారు.
అసభ్యకర ప్రవర్తన కేసులో
రెండేళ్ల జైలు, జరిమానా
బొబ్బిలి: పట్టణానికి చెందిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన స్థానికుడు బొట్ట అప్పారావు అనే వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విఽధిస్తూ న్యాయమూర్తి హేమ స్రవంతి జానకిరామ్ మంగళవారం తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పారావు 2020లో మహిళపై వేధింపులకు పాల్పడగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం ఆ కేసు తుది తీర్పును అనుసరించి న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చినట్లు తెలిపారు.


