సబ్బవరం (విశాఖ): అమ్మవారి దర్శనానికి బయలుదేరిన ఓ యువకుడి ప్రయాణం విషాదాంతమైంది. స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం మండలం కటారిపురం గ్రామానికి చెందిన పంచిరెడ్డి దుర్గారావు (26) పెందుర్తి మండలం ప్రహ్లాదపురం సమీపంలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఆదివారం తన స్నేహి తులు బల్లా బుచ్చిబా బు, బల్లా భూదేవితో కలిసి అనకాపల్లిలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిన్నయ్యపాలెం సమీపానికి చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందాడు. బుచ్చిబాబు, భూదేవి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని కేజీహెచ్కు తరలించారు. దుర్గారావు మృతితో కుటుంబ సభ్యులు, స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి తండ్రి పంచిరెడ్డి చిన్నంనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సబ్బవరం ఎస్ఐ సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు


