● రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద మృతి
● పలువురికి గాయాలు
సీతానగరం: దైవ దర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద మృతి చెందిన సంఘటన ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలియజేసిన వివరాల ప్రకారం.. చీపురుపల్లి మండలం అలజంగి గ్రామానికి చెందిన చింత గురునాయుడు (52) అలియాస్ దాసు, కుటుంబ సభ్యులు పది మందితో కలిసి రాయగడలోని మజ్జిగౌరి దర్శనానికి ఆటోలో శనివారం రాత్రి బయలుదేరారు. సీతానగరం మండలం జోగింపేట వద్దకు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు చేరుకున్నారు. ఈ సమయంలో అదే రోడ్డులో పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న బొలేరో వ్యాన్ ఎదురుగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గురునాయుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన వారు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథ్ పరిశీలించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హేమలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


