వీరఘట్టం: మండలంలోని చలివేంద్రి గ్రామంలో ఆదివారం పట్టపగలే దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గర్బాన శంకరరావు ఇంటిలో దొంగలుపడి రూ. 1.80 లక్షల నగదు, అరతులం బంగారు చెవిదిద్దులు తీసుకెళ్లిపోయారు. బాధితుడు, పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బాధితుడు శంకరరావు వ్యవసాయ పనుల పెట్టుబడి కోసం రెండు రోజుల కిందటే బ్యాంక్లో బంగారం తాకట్టుపెట్టి రూ. 1.80 లక్షల నగదు తీసుకుని, ఇంటిలోని బీరువాలో భద్రపరిచాడు. ఆదివారం ఉదయం ఆయన పొలం పనులకు వెళ్లగా.. అతని భార్య హేమ భోజనం తీసుకుని పొలానికి వెళ్లింది. ఇంటికి తాళం వేసి, పక్కనే ఉన్న గోడపై తాళంచెవి పెట్టడంతో.. గమనించిన దొంగలు ఇంటి తలుపులు తెరిచి దొంగతనానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై షణ్ముకరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


