ఇది విద్యార్థుల ఐక్య విజయం | - | Sakshi
Sakshi News home page

ఇది విద్యార్థుల ఐక్య విజయం

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

విజయనగరం గంటస్తంభం: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం దేశ విద్యార్థుల ఐక్యపోరాట విజయమని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు. 24 మంది అమాయక విద్యార్థుల ప్రాణత్యాగానికి, లక్షలాది మంది విద్యార్థుల ఆవేదనకు ఈ రాజీనామా సమాధానమని వ్యాఖ్యానించారు. విజయనగరంలోని కోట కూడలి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శనివారం బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ సీహెచ్‌ హరీష్‌ మాట్లాడుతూ... గడిచిన 45 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థిలోకం చేసిన అలుపెరుగని పోరాటానికే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. విద్యార్ధుల న్యాయమైన ఆందోళనలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ సెల్‌ ద్వారా విదేశీ నిధుల ఉద్యమంగా, దేశద్రోహ చర్యగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నిందని మండిపడ్డారు. అన్ని రకాల నిర్బంధాలు, లాఠీచార్జీలు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగాలను ఎదుర్కొని విద్యార్థిలోకం చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. విద్యావ్యవస్థలో సంపూర్ణ జవాబుదారీతనం వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. నీట్‌, నెట్‌ పరీక్షల అవినీతికి కారణమైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని తక్షణమే రద్దు చేయాలని, బలవన్మరణాలకు గురైన 24 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యా రంగంలో కాషాయీకరణ, ప్రైవేటీకరణ విధానాలు నశించాలని నినాదాలు చేశారు. ఈ ఉద్యమ స్ఫూర్తితోనే భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై మరింత పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన డీఎస్సీ అవకతవకలపై కూడా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంశీ, రమణ, భారతి, సూరిబాబు, గుణ, జయ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు చరణ్‌, గణేష్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు జె.రవికుమార్‌, లోకేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement