విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు (ఈఈ)గా ఆర్డబ్ల్యూఎస్/ఆర్అండ్బీ శాఖకు చెందిన కె.మురళీబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రోడ్లు, భవనాల శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (డీఈఈ)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ సమగ్రశిక్ష ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గురువారం ఆయన స్థానిక సమగ్రశిక్ష కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ ఈఈగా బాధ్యతలు నిర్వహించిన హరిప్రసాద్ను మాతృ సంస్థకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖ పరధిలో కొనసాగుతున్న పాఠశాలల మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనుల వేగవంతానికి కృసిచేస్తానని వెల్లడించారు.
కేజీబీవీల బోధనా సిబ్బంది మోరిట్ జాబితా విడుదల
విజయనగరం అర్బన్: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని డీఈఓ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నియామకాలకు సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితా, రోస్టర్ పాయింట్ల వివరాలను జిల్లా అధికారిక వెబ్సైట్ ‘విజయనగరం.ఏపీ.జీఓవి.ఐఎన్’లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మెరిట్ జాబితాపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు, వ్యత్యాసాలు ఉంటే తగిన ఆధార పత్రాలతో నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ పేర్కొన్నారు. ఈ నెల 25, 27, 28 తేదీల్లో కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. నిర్దేశించిన గడువు ముగిసిన తర్వాత అందిన అభ్యంతరాలను ఏ పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని, అఽభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.


