బొబ్బిలి: జిల్లాలో ఖాళీగా ఉన్న 314 మంది అంగన్వాడీ కార్యకర్తల నియామకాలను మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని ఐసీడీఎస్ పీడీ కె.వి.బాలామణి అన్నారు. బొబ్బిలి పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో బాల్యవివాహాల నిరోధం అమలుపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మట్లాడారు. బాల్యవివాహ రహిత జిల్లాగా మార్చడమే మనముందున్న లక్ష్యంగా భావించాలన్నారు. అనంతరం విలేకర్లతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2,500 అంగన్వాడీ కేంద్రాల్లో ఫేషియల్ యాప్ ఆధారంగా మెనూ అమలు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి 4,374 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించామని తెలిపారు. జిల్లాలో 99 సూపర్ వైజర్ పోస్టులుండగా ఇందులో 40 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో సీడీపీఓ జె.విజయలక్ష్మి, ఎంపీడీఓ పోతుల రవికుమార్, ఎంఈఓ గొట్టాపువాసు, బొబ్బిలి, బాడంగి వైద్యులు భరధ్వాజ్, సాయి కుమార్, వన్స్టాప్ సెంటర్ కేస్ వర్కర్ అనిత, తదితరులు పాల్గొన్నారు.
మేం చనిపోతే వచ్చేదేం లేదు...
కార్యకర్తలుగా తాము పలు యాప్లను ఫాలో అవుతూ వివరాలను అప్లోడ్ చేస్తున్నామని, కానీ మేం పని ఒత్తిడి, అనారోగ్యంతో మృతి చెందితే మాకు ఏం వస్తుందని పీడీ బాలామణిని సంఘం వీధి కార్యకర్త శ్రీదేవి ప్రశ్నించారు. ఇటీవల ఓ కార్యకర్త చనిపోతే తాము పరామర్శకు వెళ్లామని, అక్కడి వారు అమ్మా మీరు కూడా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు కదా.. ఏమైనా వస్తుందా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయామన్నారు. అది ప్రభుత్వ పాలసీ అని, శాఖాపరంగా ఏదేని సమస్య ఉంటే తాను పరిష్కరిస్తానని పీడీ అనడంతో కార్యకర్తలంతా నిర్వేదనకు గురయ్యారు.


