● దస్తావేజు లేఖరుల నిరవధిక సమ్మె
విజయనగరం రూరల్:
దస్తావేజు లేఖరుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396 రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు మరోసారి సమ్మెబాట పట్టారు. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సోమవారం నుంచి నిరవధిక సమ్మెలో దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి స్థిరాస్తి వ్యాపారం మందగించడం, భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో రెండేళ్లుగా ఆదాయం అంతంతమాత్రంగా ఉన్నా కుటుంబాలను నెట్టుకొస్తున్నామని దస్తావేజు లేఖర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఉద్యోగాలు లేక ఇదే వృత్తిని జీవనంగా చేసుకుని నెట్టుకొస్తున్న నిరుద్యోగులు, ఎన్నో ఏళ్లుగా దీనిపై ఆధారపడి జీవిస్తున్న లేఖరులకు చంద్రబాబు సర్కారు ‘సంపద సృష్టి’ పేరుతో ఆర్ఎస్కేలు ఏర్పాటు చేస్తామనడంపై వారు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం జీవో ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని దస్తావేజు లేఖర్లు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పది రోజుల నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్థిరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు సోమవారం నిలిచిపోయాయి.


