విజయనగరం అర్బన్: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అయిన పరిస్థితి ఏర్పడినందున, విద్యా హక్కు చట్టం–2009లో అవసరమైన సవరణలు చేసి వారికి టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు కోరారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ఆదివారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకుల బృందం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి గజపతిని మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ చట్ట సవరణ జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించేలా తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సుదీర్ఘ సర్వీసును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులను కలిసిన వారిలో జిల్లా చైర్మన్ పాల్తేరు శ్రీనివాస్, సెక్రటరీ జెనరల్ సీహెచ్ భాస్కరరావు, ఆర్థిక కార్యదర్శి డి.శ్యామ్, వివిధ సంఘాల ప్రతినిధులు డి.ఈశ్వరరావు, ఎన్వీ పైడిరాజు, టి.సన్యాసిరాజు, ఎస్.శివప్రసాద్, వి.రమణ, ఎస్.భాస్కరరావు, వెంకటనాయుడు, మట్టా అప్పారావు, బుఖారీ బాబు, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.


