● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం
విజయనగరం టౌన్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, భూ సమస్యలు, అత్యాచార ఘటనలు నిరోధించేందుకు తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలుపరుస్తామని.. కుల వివక్షత పాటిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం స్పష్టం చేశారు. శనివారం స్థానిక యూత్ హాస్టల్లో దళిత బహుజన శ్రామిక యూనియన్, పారా సంస్థల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సంరక్షణకు ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. దళిత బహుజన శ్రామిక్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు మాట్లాడుతూ.. అట్రాసిటీ చట్టంలో సెక్షన్ 15 ద్వారా బాధితులు, సాక్షులకు ప్రత్యేకమైన హక్కులు ఇవ్వబడ్డాయని, వాటిని అమలుపరచడం ప్రభుత్వ ప్రధానమైన బాధ్యతన్నారు. అనంతరం అట్రాసిటీ చట్టం అమలు సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా ఎలా సేకరించవచ్చో సీహెచ్ ఆదినారాయణ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కేసీహెచ్.బంగారురాజు, జిల్లా కార్యదర్శి ఎంపి.రాజు, సియాదుల పార్వతి, కోరుకొండ వరలక్ష్మి, సీనియర్ అడ్వకేట్ గంటా మోహనరావు, మాజీ కార్పొరేటర్ దాసరి సత్యం, బవిరెడ్డి శంకరరావు, గిరిజన సంఘ నాయకులు నరసింహదొర, మల్లయ్య, దళిత సంఘాల నాయకుడు ఆదాడ మోహనరావు, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు బోని కృష్ణ పాల్గొన్నారు.


