వేపాడ: మండలంలోని నీలకంఠరాజపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐఎఫ్బీ ప్యానల్ను దొంగిలించిన కేసులో వల్లంపూడి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వల్లంపూడి స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ.. నీలకంఠరాజపురం హైస్కూల్లో ఈ నెల 23 అర్ధరాత్రి 9వ తరగతి గది తాళం పగులకొట్టి ఐఎఫ్బీ ప్యానల్ను కొందరు దొంగిలించారని, పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు జీవీ ఉదయ్కుమార్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వల్లంపూడి ఇన్చార్జ్ ఎస్సై జె. రామకృష్ణ దర్యాప్తు చేపట్టగా.. కుమ్మపల్లి జంక్షన్ వద్ద ముగ్గురు నిందితులు శనివారం పట్టుబడ్డారని తెలిపారు. పట్టుబడిన వారిలో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గవరపాలెంనకు చెందిన కొలుసు కృష్ణ అలియాస్ శివ, వేపాడ మండలం పెదగుడిపాలలో తాతగారి ఇంటి వద్ద ఉంటున్న సబ్బవరపు రాకేష్, వేపాడ మండలం బల్లంకికి చెందిన వనుముల దుర్గాప్రసాద్ పట్టుబడగా.. మరో వ్యక్తి పరారయ్యాడని చెప్పారు. నిందితుల నుంచి ఐఎఫ్బీ ప్యానల్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆటోను సీజ్ చేశామన్నారు. నిందితులను కొత్తవలస కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.


