విజయనగరం రూరల్: ఈ నెల 30 నిర్వహించనున్న కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ) ప్రథమ స్నాతకోత్సవానికి కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆహ్వానిస్తూ ఢిల్లీలో శుక్రవారం ఆహ్వానపత్రికను అందజేసినట్టు సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్ ఫోన్లో తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు సమ్మతి తెలిపారన్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యా, అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించినట్టు పేర్కొన్నారు.
బొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల కొరత
బొండపల్లి: బొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కీలక పోస్టుల్లో ఉద్యోగులు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా పని చేసిన వైకుంఠంరాజేశ్వరరావు వీరఘట్టం తహసీల్దార్గా ఉద్యోగోన్నతిపై నెల రోజుల కిందట బదిలీ అయ్యింది. సీనియర్ అసిస్టెంట్ దాసరి అప్పలరాజు గతేడాది ఉద్యోగవిరమణ పొందినా ఆ స్థానంలో ఎవరినీ భర్తీ చేయలేదు. ఆర్ఐ హరికృష్ణకు గత నెల ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న అజిత మూడు నెలలు పిల్లల సంరక్షణ పేరుతో లీవు పెట్టారు. జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ, మండల సర్వేయరే కార్యాలయంలో మిగిలారు. తహసీల్దార్ రాజేశ్వరరావు కూడా ఈ నెల 24 నుంచి 15 రోజులు సెలవుపెట్టడంతో గజపతినగరం డీటీ చిరంజీవిరావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కార్యాలయంలో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో వివిధ పనులపై వచ్చిన వారికి నిరాశ తప్పడంలేదు. మరోవైపు మంత్రి అనుచరుల వేధింపులు భరించలేక ఇక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యం..
చిన్నారులకు శాపం!
కొత్తవలస: మండలంలోని పాతసుంకరపాలెం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో రూ.13.50 లక్షలతో అంగన్వాడీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. 70 శాతం పైబడి పనులు పూర్తిచేసింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో ఎక్కడిపనులు అక్కడ నిలిచిపోయాయి. రెండేళ్లుగా భవనం వైపు కన్నెత్తి చూసేవారు కరువయ్యారు. దీంతో చిన్నారులు ఇరుకుగా ఉన్న అద్దెభవనంలో ఆటపాటలతో కూడిన విద్యాభ్యాసనకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


