విజయనగరం అర్బన్: రాష్ట్రంలో టెట్ పరీక్షను పూర్తిగా ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) డిమాండ్ చేసింది. స్థానిక అమర్ భవనంలో శుక్రవారం నిర్వహించిన సంఘం జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నూతన పీఆర్సీ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల టెట్ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు సుదీర్ఘకాలంగా రావాల్సి ఉన్న పెండింగ్ బకాయిలన్నింటినీ సకాలంలో పూర్తి స్థాయిలో విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు కేవీ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్ దొర, రాష్ట్ర కౌన్సిలర్ వి.గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలనాయుడు, మహేష్, సునీత, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ డిమాండ్


