భారీ స్థాయిలో జరిపిన మైనింగ్
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలం గెడ్డపువలస గ్రామ సమీపంలో భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ దందా సాగుతోంది. గత కొన్ని నెలలుగా మైనింగ్ దందా సాగుతున్నా అటువైపు రెవెన్యూ, మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడడంలేదు. ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరరావు అండదండలతో స్థానిక తాజా మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు అక్రమ మైనింగ్ క్వారీ నిర్వహిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతు వరకు తవ్వేశారు. ఖనిజాన్ని తరలించేందుకు సుమారు 2వందల మీటర్ల పొడువును సొరంగంలాంటి మార్గాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కోట్లాది రూపాయల విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు. మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని మైనింగ్ ఏడీ సూర్యచంద్ర వద్ద ప్రస్తావించగా విజిలెన్సు అఽధికారులను పంపించి పరిశీలిస్తామని, అక్రమ మైనింగ్ జరిపిన వారిపై చర్యలు చేపడతామని తెలిపారు.
మూడు ఎకరాల డీ పట్టా భూముల్లో మైనింగ్ నిర్వహణ
ఎమ్మెల్యే అండదండలతోనే
తవ్వకాలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు


