● రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల
కార్పొరేషన్ చైర్మన్
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు దివ్యాంగులు, అభాగ్యులకు అందిస్తున్న సేవలు భేష్గా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోజన వృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ జి.నారాయణస్వామి కితాబిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని ట్రస్టు ఆవరణలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు తమ ప్రతిభను కనబరుస్తూ వివిధ రకాల యోగాసనాలు వేసి అబ్బురపరిచారు. అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్ హాస్పిటల్ను, కృత్రిమ అవయవాల తయారీ యూనిట్ను నారాయణస్వామి పరిశీలించారు. అవయవాల తయారీ విధానాన్ని ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఆయనకు వివరించారు. అనంతరం 50 మంది వృద్ధులకు పింఛన్లు, బియ్యం పంపిణీ చేశారు. అలాగే పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబుల్ వెల్ఫేర్ చంద్రిక, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.


