● పట్టణానికి నీళ్లు.. పల్లెకు కన్నీళ్లా?
ఇప్పటికే పది ఊట బావుల నుంచి విజయనగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు... ఇప్పుడు మళ్లీ కొత్తగా ఊటబావులు తవ్వేందుకు సన్నాహాలు చేయడం తగదంటూ గంట్యాడ మండలం మధుపాడ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఊటబావుల తవ్వకం, నీరు మళ్లింపుతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, గతంలో 40 అడుగులకే లభించిన నీరు.. ఇప్పుడు 100 అడుగులకు పైగా బోర్లు తీసినా లభించడంలేదంటూ వాపోయారు. చెరువులు, వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయని, భవిష్యత్తులో గ్రామానికి నీటిముప్పు పొంచి ఉందని, పశు పెంపకం భారమవుతుందని, ఊటబావులు తవ్వొద్దంటూ కలెక్టర్కు విన్నవించారు. గ్రామసభ నిర్వహించకుండా, ప్రజల అభిప్రాయాన్ని పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.


