నేటి నుంచి పైడితల్లి
● మూడురోజుల పాటు ఉత్సవాలు
● 25న శిఖర ప్రతిష్ట మహోత్సవం
● ఏర్పాట్లు పూర్తి : ఆలయ ఈఓ కె.శిరీష
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు ఆలయ పునఃప్రారంభ మహోత్సవాలు మూడురోజుల పాటు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆలయ ఈఓ కె.శిరీష సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక మూడులాంతర్లు వద్దనున్న అమ్మవారి చదురుగుడి ఆలయ పునః ప్రారంభం నిమిత్తం గతేడాది నవంబరు నెలలో ఏర్పాట్ల పనులను ప్రారంభించామన్నారు. రానున్న పండగ నేపథ్యంలో ముందస్తుగా విస్తరణ పనులు పూర్తిచేయగలిగామని చెప్పారు. మూడురోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23న మంగళవారం యాగశాల ప్రదక్షిణ, పంచభూతాలకు బలిహరణ, యాగశాల ప్రవేశం, పరిషత్, ప్రతిష్టా సంకల్పం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, రుత్విక్వరుణులు, అఖండ దీపారాధన, క్షీరాభిషేకం, సాయంత్రం 4 గంటల నుంచి మత్సంగ్రహణ, అంకురారోపణ, మూలమంత్ర హోమాలు, పూర్ణాహుతి, 24న బుధవారం విఘ్నేశ్వరపూజ, వాస్తు బలిహరణ, జలాదివాసం, సాయంత్రం 4 గంటల నుంచి గ్రామ ప్రదక్షిణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, మేళతాళాలతో వైభవంగా నిర్వహిస్తామన్నారు. 25న ఉదయం 7.35 గంటల నుంచి విఘ్నేశ్వరపూజ, ఉదయం 10.47 గంటలకు సింహలగ్నంలో యంత్ర,శిఖర ప్రతిష్ట స్ధాపన, పూర్ణాహుతి, ప్రతిష్టాఫలస్వీకరణ, అగ్నిప్రదక్షిణ, ప్రాణ ప్రతిష్ట, జీవ కల్యాన్యాసములు, కుంభదర్శనం, గోదర్శనం, దీక్షా విమోచనం, అన్నసమారాధన ఉంటుందన్నారు. భక్తులందరూ అమ్మవారి ఆలయ పునఃప్రారంభ మహోత్సవాల్లో పాల్గొని తరించాలని కోరారు.


