● అధికారులను ఆదేశించిన ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, చీఫ్ ఇంజినీర్ స్వర్ణకుమార్
రాజాం: తోటపల్లి సాగునీటి కాలువల ద్వారా రాజాం నియోజకవర్గంలో శివారు ప్రాంతాలకు సాగునీటిని అందించాలని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, విశాఖపట్నం నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజినీర్ స్వర్ణకుమార్ డీఈఈలు, ఏఈలను ఆదేశించారు. మండలంలోని చీకటిపేట నుంచి బొద్దాం వరకున్న తోటపల్లి ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువను శనివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యాత్మకంగా మారిన రీచ్లు, గట్లు, స్లూయీస్లపై ఆరా తీశారు. పాడైన వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
కాలువలో వెంటనే పూడికలు తొలగించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో ఆయకట్టులో ఏ ఒక్క ప్రాంతానికి నీరు అందకపోయినా చర్యలు తప్పవన్నారు. ప్రాజెక్ట్ కుడి కాలువ పరిధిలో ఆయకట్టు బ్లూ ప్రింట్ పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈఈ గన్నిరాజు, డీఈఈలు సుబ్బారావు, లావణ్య, ప్రియదర్శిని, శంకరరావు, ఏఈలు పాల్గొన్నారు.


