● రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం అర్బన్: ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఓటర్లకు సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) 2026’ లో భాగంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1,200 మందికి పైగా ఓటర్లున్న కేంద్రాలను విభజించి, అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయ నున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1847 పోలింగ్ కేంద్రాలుండగా.. విభజన తర్వాత ఆ సంఖ్య 1969కు చేరుకుంటుందన్నారు. ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, ఆర్డీఓలు, సహాయ ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.


