బొబ్బిలి: యోగ విద్యలో వాయుస్తంభన విద్యకు అధిక ప్రాధాన్యం ఉందని యోగవిద్యోపాసకుడు వంగపండు శ్రీరాములు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బొబ్బిలి పట్టణంలోని కళాభారతి మున్సిపల్ ఆడిటోరియంలో శనివారం వాయు స్తంభన విద్యను ప్రదర్శించారు. 3 గంటల పాటు ఇసుకలో ఉండి అబ్బురపరిచారు. పతంజలి యోగ శాస్త్రంలో హఠయోగ కష్టతరం, ధైర్య సాహసాలతో కూడిందన్నారు. హఠయోగంలో జల, వాయు, త్రిజల స్తంభన విద్యలున్నాయని, ఇవి కేవలం హిమాలయాల్లో ఉన్న యోగా గురువులు మాత్రమే చేయగలరని, హిమాలయాల్లో ఉండే యోగానంద భారతి స్వామీజీ వద్ద ఈ విద్య నేర్చుకున్నట్టు శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ యోగా శిక్షకురాలు సత్య, ఎంపీడీఓ పోతుల రవికుమార్, కళాభారతి అధ్యక్షుడు నంబియార్ వేణుగోపాలరావు, పుల్లెస శ్రీనివాసరావు, డీవీ అప్పారావు, రంపా రాఘవరావు, రౌతు వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.


