డెంకాడ: గీతం యూనివర్సిటీ (విశాఖపట్నం) వేదికగా ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు జరిగిన కంబైన్న్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్–5 (సీఏటీసీ)లో డెంకాడ మండల పరిధిలోని చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ (ఏఏఓ) లెఫ్టినెంట్ ఎన్.మెహర్ వాసు ప్రతిష్టాత్మకమైన ‘ఉత్తమ ఏఎన్ఓ’ అవార్డును కై వసం చేసుకున్నారు. ఎన్సీసీ శిక్షణలో ఆదర్శప్రాయమైన నాయకత్వ పటిమను కనబరుస్తూ, క్యాడెట్ల సర్వతోముఖాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను ఈ విశిష్ట గౌరవం దక్కింది. విశాఖపట్నం 2(ఏ) సీటీఆర్ ఎన్సీసీ యూనిట్ (ఆర్మీ వింగ్) కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ కార్తీక్ నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన ఈ ముగింపు వేడుకల్లో యూనిట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జి. భద్రయ్య చేతుల మీదుగా లెఫ్టినెంట్ మెహర్ వాసు ఈ అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. క్యాంప్ నిర్వహణలోను, క్రమశిక్షణను పెంపొందించడంలోనూ ఆయన చూపిన అంకితభావం తోటి అధికారుల ప్రశంసలు అందుకుంది. జాతీయ స్థాయిలో సంస్థకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన లెఫ్టినెంట్ ఎన్. మెహర్ వాసును ఎంవీజీఆర్ కళాశాల యాజమాన్యం శుక్రవారం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ఎన్సీసీ పీఐ సిబ్బంది, వివిధ విభాగాల ఏఏఓలు, క్యాడెట్లు పాల్గొన్నారు.


