● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం రూరల్: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందని, భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతవరం యోగా అని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రమైన రామనారాయణం వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో పాటు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు రోజుకు 30 నిమిషాలు యోగాకు కేటాయించాలన్నారు. అనంతరం యోగా గురువులను సత్కరించారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణిలతో పాటు జిల్లా అధికారులు, ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం సీతారామయ్య, నోడల్ అధికారి డాక్టర్ వరప్రసాద్, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళలకు తప్పని ఇబ్బందులు
యోగాంధ్ర కార్యక్రమానికి జన సమీకరణకు కింది స్థాయిసిబ్బంది అవస్థలు పడ్డారు. డీఆర్డీఏ, ఐసీడీఎస్ పరిధిలోని అధికారులు జన సమీకరణకు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధి హామీ వేతనదారులను యోగాంధ్ర కార్యక్రమానికి తరలించారు. యోగాసనాలు వేసేందుకు అనువైన ప్రదేశం లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు.


