● రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
విజయనగరం అర్బన్: జాతీయ రహదారులపై పలుచోట్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అనధికార వాహన పార్కింగ్ను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ అంశాలపై వివిధ శాఖల అధికారులతో గురువారం వీడియా కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల పక్కన ఉన్న హోటళ్లు, టీ దుకాణాల వద్ద వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనధికార పార్కింగ్ను నివారించడంతోపాటు, హోటల్ యాజమాన్యాలను బాధ్యులుగా చేయాలని సూచించారు. అవసరమైతే వాహనాల నిలుపుదల ప్రాంతాలను సూచించే బోర్డులు, పోల్స్ను ఆయా మాజమాన్యాలే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల పరిసర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, హైబీమ్ లైట్ల వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. రహదారి భద్రత కోసం టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల వివరాలను వివిధ శాఖలకు ఒకేసారి చేరవేసే కేంద్ర ప్రభుత్వ డిజిటల్ వేదిక ‘ఈ–డార్’ అమలులో విజయనగరం జిల్లా దేశంలో మూడో స్థానంలో దక్షిణ భారత దేశంలో తోలిస్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని కోరారు. రద్దీ సమయాల్లో విద్యార్ధులు బస్సు ప్రయాణంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అవసరమై మార్గాల్లో అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. సమాశంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


