● కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి
విజయనగరం కలెక్టరేట్: అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో 190 వినతులు రాగా.. అందులో 108 రెవెన్యూ సంబంధిత సమస్యలే కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలను సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 108 వినతులు రాగా.. డీఆర్డీఏకు 25, పంచాయతీరాజ్కు 18, మున్సిపల్కు 5, విద్యుత్కు 1, హౌసింగ్కు 1, డీఎంహెచ్ఓకు 8, గ్రామ సచివాలయ శాఖకు 5, విద్యాశాఖకు 3, ఇతర శాఖలకు సంబంధించి 16 వినతులు అందాయని చెప్పారు. పీజీఆర్ఎస్ పురోగతిని ప్రతి వారం స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీదారులను కలిసి, మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్టులో నమోదు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100 గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.


