
యోగాంధ్రకు జన సమీకరణ
● వేలల్లో తరలింపునకు సన్నాహాలు ● శాఖల వారీగా లక్ష్యం ● ప్రత్యేకంగా బస్సులు ● తలలు పట్టుకుంటున్న అధికారులు
సాక్షి, పార్వతీపురం మన్యం : ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలో జరగనున్న యోగాంధ్ర వేడుకల నిమిత్తం జన సమీకరణకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం.. దాదాపు 5 లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో ఆ మేర కు ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టీసీ, ప్రైవేట్ సర్వీసుల ను వినియోగిస్తున్నారు. విద్యార్థులతో పాటు.. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. ఇప్పటికే యోగా మాసోత్సవాల పేరిట కొద్ది రోజులుగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. జిల్లాకు రూ.50 లక్షల వరకు ఇందు కోసం ఖర్చు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా లక్ష్యం 60 వేల పైమాటే..
21వ తేదీన విశాఖలో జరిగే ప్రధాని కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కనీసం ప్రజలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి 60 వేల మందికి తక్కువ కాకుండా తరలించాలని అధికారులకు లక్ష్యం విధించారు. ఇందులో విజయనగరం జిల్లాలో విద్యార్థులు 15 వేల మంది, సాధారణ పౌరులు కనీసం మరో 15 వేల మంది ఉండాలని స్పష్టం చేశారు. వీరు కాక.. పోలీసు బలగాలు, రెవెన్యూ, ఇతర శాఖల నుంచీ ఉద్యోగులను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇందుకోసం 660 బస్సులను వినియోగిస్తున్నారు. విద్యార్థులు, ప్రజల తరలింపునకు ప్రతి బస్సుకూ ఒక లైజనింగ్ అధికారిని ఏర్పాటు చేశారు. మండల ప్రత్యేకాధికారులంతా ఈ నెల 20వ తేదీన రాత్రి మండలాల్లోనే ఉండి.. అందరినీ తరలించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 28 వేల మంది విద్యార్థులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీరుకాక.. సాధారణ పౌరులు, వివిధ శాఖల నుంచి కనీసం మరో 10 వేల మందినైనా తరలించాలని చూస్తున్నారు. ఉపాధి వేతనదారు లు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ సిబ్బందినీ తరలించే యోచనలో ఉన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆర్టీసీ, ప్రైవేట్ సర్వీసులు కలిపి మొత్తం 850 వాహనాలను జనాల తరలింపునకు సిద్ధం చేస్తున్నారు.
యోగాంధ్రలో విద్యార్థులు
ఒంటికి యోగా మంచిదేగా... ఇది కాదనలేని నిజం. అయితే దీన్ని ఎవరి వ్యక్తిగతంగా వారు ఆలోచించి చేసుకోవాల్సిన ఒక జీవన యానం. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగమైతే ఆరోగ్యవంతంగా ఉంటారన్న వాస్తవం ఎవరు కాదనరు. కానీ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విశాఖ రానుండడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టి ఆయన దృష్టిలో పడి మార్కులు కొట్టేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా యోగా దినోత్సవం పేరిట నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక కార్యక్రమం ప్రతి చోట చేయాలని నిర్దేశించారు. మురికివాడల నుంచి జిల్లా ఉన్నత కార్యాలయాల వరకు రోజూ ఏదో ఒక కార్యక్రమం చేపట్టేలా ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు. అయితే ఇదంతా బలవంతపు కార్యక్రమం కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదీ కేవలం ఫొటోలకే పరిమితం కావడం చర్చనీయాంశమైంది.
తలలు పట్టుకుంటున్న అధికారులు
ఇప్పటికే నెల రోజుల ఉత్సవంలో ప్రతి రోజూ ఏదో చోట కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. వీటికి జనాలను, విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టడం అధికారులకు తలకు మించిన భారమవుతోంది. చివరికి ఉపాధి వేతనదారులనూ వదలడం లేదు. పనులు చేసిన చోటే వారిని నిల్చోబెట్టి, ఫొటోలు తీసి కార్యక్రమాన్ని మమ అనిపించేస్తున్నారు. ఇప్పుడు యోగా దినోత్సవం రోజున వేలల్లో తరలించాల్సి రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా ఉపాధి వేతనదారులు, సంఘాల మహిళలపైనే పడ్డారు. ఆ రోజు కార్యక్రమానికి రాలేని వారికి ఉపాధి పనులు కల్పించబోమని హెచ్చరిస్తున్నారు. 8వ తరగతి దాటిన విద్యార్థులందరినీ తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలకూ ఆదేశాలిచ్చారు. యోగాసనాల కోసం తమను ఎందుకు ఇబ్బంది పెడతారని వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రధాని రానుండడంతో ఆయన వద్ద మెప్పు పొందేందుకే చంద్రబాబు ఇలా అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పాల్జేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫొటో పోజులకే యోగాంధ్ర పరిమితమైందన్న వాస్తవాన్ని ఏ ఒక్కరూ కాదనలేరని సర్వత్రా వాదన వినిపిస్తోంది.

యోగాంధ్రకు జన సమీకరణ