షాడో చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

షాడో చైర్మన్‌

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

వీఎంఆర్‌డీఏలో
చక్రం తిప్పడంలో ఎంతో ‘వినయ’ం
యుద్ధ విమానాలు,సబ్‌మైరెన్‌ మ్యూజియంల నిర్వహణ కాంట్రాక్ట్‌పై ఆరోపణలు విశాఖలో మాత్రమే రిజిస్ట్రేషన్‌ ఉండాలనే నిబంధనలపై కాంట్రాక్టర్ల భగ్గు నేవీకి ఫిర్యాదు చేసే యోచనలో పలువురు కాంట్రాక్టర్లు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ)లో ఒక షాడో చైర్మన్‌ చక్రం తిప్పుతున్నారు. వీఎంఆర్‌డీఏలో యాప్‌ అభివృద్ధి మొదలుకొని నిర్వహణ కాంట్రాక్టుల వరకూ అన్నింటిలోనూ సదరు షాడో చైర్మన్‌ వ్యవహారాలు నడుపుతున్నారు. అత్యంత ‘వినయ’ంగా వ్యవహరిస్తున్న సదరు షాడో చైర్మన్‌ వసూళ్ల వ్యవహారం రోజురోజుకీ మరింత పెరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్‌ మ్యూజియంల నిర్వహణ కాంట్రాక్టును ఒక హౌస్‌ కీపింగ్‌ సంస్థకు అప్పగించేందుకు జరుగుతున్న వ్యవహారంపై ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో గతంలో ఎన్నడూ ఏ టెండర్‌లోనూ లేని విధంగా, కేవలం విశాఖపట్నంలోనే కాంట్రాక్టు సంస్థ రిజిస్ట్రేషన్‌ ఉండాలన్న నిబంధన పెట్టడంపై కాంట్రాక్టర్లు భగ్గుమంటున్నారు. ఈ వ్యవహారంలో యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్‌లను అప్పగించిన నేవీ అధికారులకు ఫిర్యాదు చేసే యోచనలో కొద్ది మంది కాంట్రాక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ విమానాల మ్యూజియంల నిర్వహణ మరింత నాసిరకంగా తయారయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో, నేవీ అధికారులు దీనిపై దృష్టి సారించాలంటూ ఈ ఫిర్యాదులో పేర్కొననున్నట్టు సమాచారం. ఇదే జరిగితే వీఎంఆర్‌డీఏ పిలిచిన టెండర్లలో పెట్టిన నిబంధనల బాగోతం అధికారుల మెడకూ చుట్టుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నేవీకి ఫిర్యాదు చేసే యోచనలో..

విశాఖ తీరంలో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్‌ మ్యూజియంల నిర్వహణను మాత్రమే వీఎంఆర్‌డీఏకు నేవీ అప్పగించింది. అయితే, వీటి నిర్వహణ సరిగ్గా ఉందా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు నేవీ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. తాజాగా వీటి నిర్వహణ కాంట్రాక్టు అప్పగింత కోసం పిలిచిన టెండర్‌లో పేర్కొన్న వింత నిబంధనలను నేవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ విభాగంలో రాష్ట్రంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ ఉన్న సంస్థ టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు ఉన్నాయి. అయితే, విచిత్రంగా కేవలం విశాఖలోనే రిజిస్ట్రేషన్‌ ఉండాలనే నిబంధనతో పాటు... రూ. 71 లక్షల విలువైన పనికి ఏకంగా రూ. 5 కోట్ల టర్నోవరు కావాలంటూ పెట్టిన నిబంధనపైనా కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. కేవలం ముందుగానే ఎంపిక చేసిన సంస్థకు మాత్రమే టెండర్‌ దక్కేలా చేయడంలో భాగంగానే ఈ వ్యవహారం సాగుతుందంటూ టెండర్‌ డాక్యు మెంట్లతో కూడిన ఆధారాలతో నేవీ అధికారులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే వీఎంఆర్‌డీఏలో జరుగుతున్న వింతలు మరింతగా అభాసుపాలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలోనూ..

వాస్తవానికి వీఎంఆర్‌డీఏలో జరుగుతున్న వ్యవహారాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాప్‌కు వెచ్చించిన మొత్తంతో పాటు అప్పగించిన సెక్యూరిటీ కాంట్రాక్టుల వరకూ అనేక విమర్శలున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా అధికారపార్టీకి చెందిన నేతల భూములకు మరింత విలువ పెంచేందుకు అనుగుణంగా వ్యవహారం సాగించారనే విమర్శలున్నాయి. ఇక వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బంగ్లాలో చేపట్టిన హోం థియేటర్‌ నిర్మాణ వ్యయం విషయంలోనూ, ఈ కాంట్రాక్టును అప్పగించి న సంస్థతోనూ షాడో చైర్మన్‌ వ్యవహారాలు చక్కబెట్టారనే ఆరోపణలున్నాయి. ఇక కైలాసగిరి కొండపై చేపట్టిన త్రిశూల్‌ నిర్మా ణ వ్యయం విషయంలోనూ రోజుకో మా ట చెబుతూ... ఏకంగా నిర్మా ణ వ్యయాన్ని మొదటగా రూ. 1.55 కోట్లుగా శంకుస్థాప న సందర్భంగా చెప్పిన వీఎంఆర్‌డీఏ అధికారులు... ప్రారంభోత్సవ సమయానికి ఏ కంగా రూ. 6 కోట్లకు పెంచారు. ఈ నిర్మాణ వ్యయం పెంపు వ్యవహారంలోనూ షాడో చైర్మన్‌దే కీలకపాత్ర అనే విమర్శలున్నాయి.

ఇదే నేపథ్యంలో తాజాగా ఏకంగా యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్‌ల నిర్వహణ కాంట్రాక్టును... ఇప్పటికే ఎండాడ, చీమలాపల్లిలోని కన్వెన్షన్‌ సెంటర్ల నిర్వహణ కాంట్రాక్టును అప్పగించిన సంస్థకే అప్పగించేందుకు వీలుగా తాజాగా ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, మొదటగా ఇప్పటికే డెక్‌ నిర్వహణతో పా టు గతంలో యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్‌ మ్యూజియంల నిర్వహణ కాంట్రాక్టును జనసేనకు చెందిన ఒక మహిళా నేత సంస్థ కు అప్పగించాలని వ్యవహారం సాగింది. ఇదే సంస్థకు అప్పగించాలని మొదట్లో అనుకున్నప్పటికీ... తాజాగా షాడో చైర్మన్‌ చక్రం తిప్పి జనసేనకు చెందిన సదరు మహిళా నేతకు కూడా ఢోకా ఇచ్చినట్టు తాజాగా తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement