మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదివి ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 11 మంది విద్యార్థులకు శనివారం పురస్కారాలు అందజేసి, ఘనంగా సన్మానించారు. జెడ్పీ సమావేశం మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన సేనాపతి పునీత్ కుమార్(592), ఇమంది దేవిక (592), వంగపండు శివసాయి అతిథి(591), అనకాపల్లి జిల్లాకు చెందిన ఆడారి ప్రణతి(593), తనకాల ఉషా(592), కనిగిరి హరిణి(591), అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పరుంబుడి దేవి(593), పెరుశెట్టి ఊర్మిళ(515), కె.కీర్తన(505) పురస్కారాలు అందుకున్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ, అల్లూరి జేసీలు విద్యాధరి, శ్రీపూజ, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఎమ్మెల్యేలు మత్స్యలింగం, బండారు, డిప్యూటీ సీఈవో రాజ్కుమార్, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


