బీచ్రోడ్డు: పెందుర్తి గ్రామం సర్వే నంబర్ 107/11లో ఉన్న 8.8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీపై చర్యలు తీసుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు ఎస్.వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు భూమి ప్రభుత్వానిదేనని 2023 ఫిబ్రవరి 28న సీసీఎల్ఏ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ, గండి బాబ్జీ అధికారుల అండతో భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, పర్మినెంట్ నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రజాప్రతినిధులకు, కలెక్టర్, జేసీ, ఇతర అధికారులకు ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా జిల్లా ఇన్చార్జ్ మంత్రి, విశాఖ ఎంపీ తక్షణమే జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని, అక్కడ నివసిస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఇందిర, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం కన్వీనర్ ఈసర లక్ష్మి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షులు డి.ఏడుకొండలు, కాలనీవాసులు కటారి నాగేశ్వరరావు, దమ్ము దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు.


