మహారాణిపేట: జిల్లావ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా సాగింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ,డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 20,23,009 మంది ఓటర్లకు గానూ, ఇప్పటివరకు 16,37,424 ఫారాలను పంపిణీ చేసి 80.94 శాతం పూర్తి చేశారు. అలాగే 75,427 ఫారాలను డిజిటైజ్ (3.73శాతం) చేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఫారాల పంపిణీలో విశాఖ దక్షిణ (86.12శాతం), డిజిటైజేషన్లో విశాఖ ఉత్తరం (5.90శాతం) మొదటి స్థానాల్లో నిలిచాయి. ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పనులను సమీక్షించారు. ఫారాల పంపిణీ, డిజిటైజేషన్ ప్రక్రియను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని ఈఆర్వోలు, బీఎల్వోలను ఆదేశించారు. ఈ డ్రైవ్కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.


