మహారాణిపేట: మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించి యువతకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించాలని ఎంపీ ఎం. భరత్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత విశాఖ నిర్మాణంతో పాటు ఆనందభరితమైన సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్ సప్తాహ్’ వారోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం బీచ్ రోడ్డు కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు భారీ అవగాహన వాక్థాన్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఏపీ గ్రోవర్ ఆయిల్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ.. ఇటీవల సెంట్రల్ జైలును సందర్శించినప్పుడు గణనీయమైన సంఖ్యలో యువత, గిరిజన ప్రాంతాల వారు డ్రగ్స్ కేసుల్లో ఉండటం చూశానని, ఇది సమస్య తీవ్రతను తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. సమష్టి కృషి వల్ల గత రెండేళ్లలో విశాఖలో డ్రగ్స్ కేసులు తగ్గాయన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత, సెట్విస్ సీఈవో రమ్య, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


