మహారాణిపేట: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, వర్సిటీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నోవోటెల్, వీ–కన్వెన్షన్లలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కార్యాలయ ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వేదిక, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, నిరంతర విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులను ముందస్తుగా సిద్ధం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం వైద్య బృందాలు, ఫైర్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ పర్యటన సమన్వయం కోసం జేసీ విద్యాధరిని నోడల్ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ట్రైబల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మిశ్రా, ఇతర ఆచార్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. నంతరం కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చి నోవాటెల్లోని వీ–కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన భద్రత, ప్రోటోకాల్, పార్కింగ్, అతిథుల వసతి తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.


