మద్దిలపాలెం (విశాఖ): నిత్యం మన కళ్లెదుట కనిపించే తల్లిదండ్రులే ప్రతి ఒక్కరికీ ప్రత్యక్ష దైవాలని ప్రఖ్యాత గజల్ గాయకుడు, గిన్నిస్ ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, గజల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘గజల్ శ్రీనివాస్ భారతీయం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి కళాభారతి అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు), కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్ అతిథులుగా హాజరై మూడు రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతలో బాధ్యత, విలువలు, కుటుంబ బంధాల పట్ల అవగాహన పెంచేలా గజల్ శ్రీనివాస్ ఆలపించిన గేయాలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో గజల్ శ్రీనివాస్ ఒకరని కొనియాడారు.
రెండు గంటల పాటు
గజల్తో అలరింపు
దాదాపు రెండు గంటల పాటు సాగిన కార్యక్రమంలో తల్లిదండ్రుల గొప్పతనం, గురువుల పట్ల గౌరవం, దేశభక్తి, మానవ విలువలను ప్రతిబింబించే గజల్స్ను గజల్ శ్రీనివాస్ ఆలపించి ప్రేక్షకులను అలరించారు. భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన గేయాల ద్వారా సందేశమిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


