మహారాణిపేట: ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు సమరశంఖం పూరించాయి. సోమవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్కు సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ సమన్వయకర్తలు తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్టీసీ కార్మికులకు జరిగిన మేలును గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, వేలాది మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు. లాభాపేక్షే ధ్యేయంగా పనిచేసే ప్రైవేట్ శక్తులకు ఆర్టీసీని ధారాదత్తం చేయాలనుకోవడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వానికి నిజంగానే ఆర్టీసీని బలోపేతం చేయాలనే సంకల్పం ఉంటే.. సంస్థకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించి, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలన్నారు. వైఎస్సార్ట్రేడ్ యూనియన్ నాయకులు పీవీ సురేష్, రాయపురెడ్డి అనిల్కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో జిల్లా పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయచంద్ర, నియోజకవర్గ పరిశీలకుడు జహీర్ అహ్మద్, ముఖ్య నాయకులు సునీల్, బోని శివరామకృష్ణ, గోడబా మనోజ్, ఎండీ షరీఫ్, ఏడుకొండలరావు, షేక్ ఖాన్, బీపీఎన్ కుమార్ జైన్, నక్క వెంకటరమణ, మార్దుపూడి పరదేశి, బీఆర్ పాత్రుడు, పిట్టరెడ్డి, డీవీ రమణ, దాలి నాయుడు, చంద్రశేఖర్, నాగబాబు, శ్రీను, గోదేశి శ్రీనివాస్రెడ్డి, నూకరాజు తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు.
కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నిరసన


