మహారాణిపేట: బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.362ను వెంటనే రద్దు చేయాలని మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు, మహిళలు, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో బీచ్లలో మద్యం విక్రయాలకు అవకాశం కల్పించడం సమాజానికి హానికరమన్నారు. మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో సందర్శించే బీచ్ ప్రాంతాల్లో రెడీ టు డ్రింక్ కేంద్రాలు, బీచ్ షాక్స్, ఇతర వినోద కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల జీవో నెం.362ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనలో సీఎంఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.లలిత, జె.శ్యామల, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్.ఎన్.మాధవి, కార్యదర్శి వై.సత్యవతి తదితర మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


