మహారాణిపేట: స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ప్రమాదాలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ నిర్వహించి, బాధ్యులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా అనంతరం పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటీకరణ విధానాల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన వారికి రూ.50 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరారు. ధర్నాలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు ఎస్. వెంకటలక్ష్మి, కార్యదర్శి రోహిణిదేవి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


