అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కిరెడ్డిపాలెంకు చెందిన రావాడ తేజేశ్ (20) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆటోనగర్లోని వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కోసం తేజేశ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీహెచ్పీవీ–ఆటోనగర్ రహదారిపై పనుల్లో ఉన్న జీవీఎంసీ డెబ్రిస్ క్లీనింగ్ వాహనాన్ని వెనుక నుంచి తేజేశ్ బైక్తో బలంగా ఢీకొట్టాడు. లారీ వెనుక భాగం తలకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాద సమయంలో యువకుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే మృతి చెందాడని గాజువాక ట్రాఫిక్ సీఐ షేక్ హుస్సేన్ తెలిపారు.


