సింహాచలం: చందనోత్సవానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, సింహాచలం దేవస్థానం సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. శనివారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, ఈవో జె.వెంకటరావులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రూ.300, రూ.1,000, రూ.1,500 విభాగాల్లో సుమారు 40 వేల టికెట్లు విక్రయించామని, మిగిలిన వారంతా ఉచిత దర్శనం ద్వారా స్వామిని దర్శించుకుంటారన్నారు. సుమారు 500 మంది వీఐపీలు, ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే ఉదయం 5 గంటల లోపు అంతరాలయ దర్శనం కల్పిస్తామని, ఆ తర్వాత ఎవరికీ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. భక్తులు కొండపైకి మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేద న్నారు. భక్తులు టైమ్ స్లాట్ల ప్రకారమే దర్శనానికి రావాలని స్పష్టం చేశారు. నకిలీ టికెట్లతో వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


