హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి
విశాఖ లీగల్: శరవేగంతో వృద్ధి చెందుతున్న విశాఖ అన్ని రంగాల్లో ఉజ్జల భవిష్యత్తు ఉందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని నాలుగు అదనపు న్యాయస్థానాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంతో విస్తరిస్తున్న విశాఖలో వాణిజ్య వ్యాపార అంశాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. నానాటికి పెరుగుతున్న వాద్యాలకు తగిన విధంగా కొత్త న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రెండు కుటుంబ న్యాయస్థానాలు, రెండు సీబీఐ న్యాయస్థానాలను ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి మాట్లాడుతూ కక్షిదారుల అవసరాలకు అనుగుణంగా నూతన న్యాయస్థానాలు ఏర్పాటు జరిగిందన్నారు. వివాదరహితంగా మధ్యవర్తిత్వంతో కేసులు రాజీ చేసుకుంటే న్యాయస్థానాలపై భారం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతీనాయుడు, సీనియర్ న్యాయవాదులు శిష్టాల శ్రీనివాసమూర్తి, సన్నీయాదవ్ తదితరులు పాల్గొన్నారు


