సింహాచలం: చందనోత్సవం టికెట్ల విక్రయాలను బుధవారం నుంచి బ్యాంకుల్లో 50 శాతానికి పెంచుతున్నట్టు దేవస్థానం ఈవో వెంకటరావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఆన్లైన్లో 70 శాతం, ఆఫ్లైన్లో బ్యాంకుల ద్వారా 30 శాతం టికెట్లు జారీచేస్తున్నామని, ఇకపై బ్యాంకుల్లో 50 శాతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి ఆఫ్లైన్లో రూ.300 టికెట్లు 2,400, రూ.1,000 టికెట్లు 1,760, 16న రూ.300 టికెట్లు 2400, రూ.1000 టికెట్లు 1590, 17న రూ.300 టికెట్లు 2400, రూ.1000 టికెట్లు 1590 జారీ చేస్తామన్నారు. ఆన్లైన్లో నగదు కట్ అయ్యి టికెట్ రాకపోతే తిరిగి నగదు చెల్లించే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. సాఫ్ట్వేర్లో లోడు ఎక్కువ అవడంతో సాంకేతిక సమస్య వచ్చిందన్నారు.


