విశాఖ సిటీ: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 45 వినతులు అందాయి. విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి లో–వోల్టేజ్, విద్యుత్ లైన్ల మార్పు, విద్యుత్ బిల్లులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, రూఫ్ టాప్ సోలార్కు సంబంధించిన సమస్యలు, విద్యుత్ కనెక్షన్ల మంజూరు వంటి సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వినతులను సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్, లేదా వాట్సాప్ నంబరు 9493681912 ద్వారా కూడా తమ విద్యుత్ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టీవీ సూర్యప్రకాష్, సీజీఎం వి.విజయలలిత, జీఎం వీవీఎస్ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


