సింహాచలం: ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సోమవారం తొలివిడత చందనం అరగదీత శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈనెల 20న వైశాఖ శుద్ద తదియ నాడు చందనోత్సవాన్ని పురస్కరించుకుని నిజరూపదర్శనం అనంతరం స్వామికి తొలివిడతగా సమర్పించాల్సిన మూడు మణుగుల పచ్చి చందనాన్ని (సుమారు 125 కిలోలు) సమకూర్చేందుకు ఈ అరగదీత కార్యక్రమం చేపట్టారు. తొలుత ఆలయ బేడా మండపంలోని బాండాగారం వద్ద తొలి చందనం చెక్కను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు తొలిచందనాన్ని అరగదీశారు. కాగా ప్రధానార్చకుడి హోదాలో గొడవర్తి శ్రీనివాసాచార్యులు తొలి చందనాన్ని అరగదీయడం ఇది ఆరోసారి కావడం విశేషం.


