ఆనందపురం: మండల పరిధిలోని పాలవలస పంచాయతీలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బంక పైడిరాజు (25) అనే ఆటో డ్రైవర్ దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కణమాం గ్రామానికి చెందిన పైడిరాజు గుడిలోవలోని శివాలయాన్ని దర్శించుకుని, ఉదయం 8.30 గంటల సమయంలో ఆటోలో తిరిగి ఇంటికి బయలుదేరారు. విజ్ఞాన విహార పాఠశాల సమీపంలో ఆటో అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పైడిరాజు తీవ్రంగా గాయపడగా, ఆనందపురం పోలీసులు తక్షణమే స్పందించి చికిత్స నిమిత్తం పినాకిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతుడి తండ్రి బంక సన్యాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ వాసునాయుడు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.


