తగరపువలస : స్థానిక గంభీరంలోని ఐఐఎం విశాఖపట్నం, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ’స్కిల్ టు ఎంటర్ప్రైజ్ మోడల్’ కార్యక్రమం శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. 18 నెలల పాటు సాగిన ఈ ’పీజీ సర్టిఫికెట్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్’ కోర్సులో 30 మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 10 నెలల తరగతి గది శిక్షణ, 8 నెలల మెంటార్షిప్ ద్వారా అభ్యర్థులను సమర్థవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. ఐఐఎంవీ డీన్ ప్రొఫెసర్ ఆర్.ఎస్.వర్మ, సిడ్బీ ఏజీఎం గోవిందరాజన్ భాస్కర్ గారు హాజరై, వ్యాపార రంగంలో క్రమశిక్షణ, ఆర్థిక వనరుల నిర్వహణ ప్రాముఖ్యతను వివరించారు. ఈ వినూత్న ప్రోగ్రామ్ ద్వారా ఐఐఎంవీ ఇప్పటివరకు 90 మందికి పైగా ఉపాధి కల్పించడం విశేషం. పారిశ్రామిక సందర్శనలు, బ్యాంకర్లు, వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖాముఖి చర్చల ద్వారా అభ్యర్థులు వ్యాపార ప్రపంచంలోని మెళకువలను నేర్చుకున్నారని ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుశీల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరణం బాల తరుణ్ కుమార్, జోస్యుల శ్రీనివాస్, ఎం. చంద్రశేఖర్ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.


