మహారాణిపేట: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ గురువారం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలను సందర్శించారు. ఇందులో భాగంగా శ్రీవిజయ నగర్లోని కేంద్రీయ విద్యాలయం, కొమ్మాదిలోని జవహర్ నవోదయ విద్యాలయాలను సందర్శించి, అక్కడి విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. ప్రతి తరగతి గదిని, గ్రంథాలయాన్ని, ప్రయోగశాలలను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలను, వాతావరణాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం వివిధ తరగతుల విద్యార్థులతో సంభాషించి, వారి అభ్యాసన సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని చూసి ముగ్ధులయ్యారు. విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిభ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమ అమలుకు సంబంధించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.ఈ పర్యటనలో పాఠశాల విద్యాశాఖ జోన్–1 ఆర్జేడీ బి.విజయభాస్కర్, డీఈవో ఎన్.ప్రేమకుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జె. చంద్రశేఖర్, లెక్చరర్ డాక్టర్ ఎస్.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కాగా.. జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తన చాంబర్లో జ్ఞాపికను అందజేశారు.
పీఎం శ్రీ పాఠశాలలను సందర్శించిన
కేంద్ర కార్యదర్శి రాఘవ్ లాంగర్


