మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

Sep 25 2023 12:58 AM | Updated on Sep 25 2023 9:26 AM

- - Sakshi

అచ్యుతాపురం(అనకాపల్లి): అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన దానయ్య(17) ఆదివారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మనస్తాపం వల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సున్నితమైన అంశం కావడంతో ఎస్పీ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తుండగా, డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. అచ్యుతాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

పూర్వ విద్యార్థి దానయ్య రెండు రోజుల క్రితం పూడిమడక ఉన్నత పాఠశాలకు వెళ్లి అక్కడి ప్రధానోపాధ్యాయునిపై చేయి చేసుకోవడంతోపాటు సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులను టీజింగ్‌ చేశాడని తెలిపారు. దీంతో హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు పూర్వ విద్యార్థిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి నోటీసు ఇచ్చి పంపించామన్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన కారణం, ఉన్నత పాఠశాలలో వివాద అంశాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామన్నారు. మరోవైపు పోలీసులు దుర్భాషలాడటంతో మనస్తాపానికి గురై దానయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది అతడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీసీ కోసం హెచ్‌ఎం పలుమార్లు తిప్పించడం వల్లే గొడవ జరిగి ఉంటుందని, అనంతరం పోలీసు కేసులోకి వెళ్లడంతో మనస్తాపానికి గురయ్యాడని మృతుడి సన్నిహితులు వాపోతున్నారు. కుమారుడి మృతితో తల్లి తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement