బషీరాబాద్: మైల్వార్తండా శివారులో రిజర్వు అటవీ భూమిని ఆక్రమించి సాగు పనులు చేపట్టిన ఘటనలో ట్రాక్టర్ యజమానికి అటవీశాఖ అధికారులు గురువారం రూ.లక్ష జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని అదే రోజు చెల్లించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి స్నేహశ్రీ తెలిపారు. సర్వే నంబర్ 280లోని అటవీ భూమిలో చెట్లు నరికి సుమారు ఎకరం విస్తీర్ణాన్ని సాగుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు. ఈ నెల 2న ట్రాక్టర్తో భూమిని దున్నుతుండగా అధికారులు దాడి చేసి ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాండూరు రేంజ్ కార్యాలయానికి తరలించారు. భూమిని ఆక్రమించిన ధర్మానాయక్, ట్రాక్టర్ డ్రైవర్ మొగులయ్యపై అటవీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆక్రమణకు గురైన ఎకరం అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
● చదును చేసిన ట్రాక్టర్ సీజ్
● యజమానికి రూ.లక్ష జరిమానా


