
స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే..
పరిగి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర నిర్వహిస్తోందని, కానీ అది జనరహిత పాదయాత్రగా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. జనాల్లోకి వెళ్లకుండా బందోబస్తు నడుమ పాదయాత్ర చేస్తే ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల్లో దేన్నీ పూర్తిగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై జనాలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. యాభై ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందో చూపించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు..
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర అట్టర్ ప్లాఫ్ అయ్యిందన్నారు. ఇందులో ఎక్కడా వెయ్యి మంది కూడా కనిపించలేదని, ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న పాదయాత్ర సీఎం రేవంత్రెడ్డికే ఇష్టం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్కుమార్, మాజీ ఎంపీపీ అరవింద్రావు, నాయకులు ప్రవీణ్రెడ్డి, సురేందర్, తహేర్ఆలీ, రవికుమార్, కృష్ణ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాదయాత్రపైబీఆర్ఎస్ నేతల విమర్శలు
అది జన రహిత పాదయాత్ర:మాజీ ఎమ్మెల్యే ఆనంద్
సీఎం రేవంత్రెడ్డికే ఇష్టం లేదు: మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి