
ఇసుక తోడేళ్లు
కాగ్నా నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా
● రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా.. ● అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ● ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
తాండూరు రూరల్: నియోజకవర్గంలో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. గోనూర్, వీర్శెట్టిపల్లి గ్రామాల మధ్య ఉన్న కాగ్నా వాగు నుంచి రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భజలాలు పడిపోతున్నాయని సమీప గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సిబ్బంది కొరత కారణంగా చేతులెత్తేస్తున్నారు.. పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. తాండూరు మండల పరిధిలోని గోనూర్, వీర్శెట్టిపల్లి గ్రామాల మధ్య కాగ్నా వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులో ఇసుక పుష్కలంగా ఉండటంతో అక్రమార్కుల కన్ను పడింది. వర్షాలు పడకపోవడంతో ఇదే అదనుగా భావించిన కొందరు రాత్రి వేళ ట్రాక్టర్లతో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గోనూర్కు చెందిన ఓ యువ నాయకుడి అండదండలతోనే ఈ తతంగం నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ పోలీసులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటే నాయకులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో మాకెందుకులే అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. గతంలో ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని జరిమానా విధించి కేసులు నమోదు చేసినా దందా ఆగడం లేదు.
చీకటి పడితే చాలు..
రాత్రి 9 గంటలైతే చాలు కాగ్నా వాగు నుంచిఇసుక తరలింపు మొదలవుతుంది. తెల్లవారుజమున ఆరు గంటల వరకు యథేచ్ఛగా తరలిస్తారు. ఇసుక ట్రా క్టర్ల కారణంగా రాత్రి నిద్ర పట్టడం లేదని గోనూర్, వీర్శెట్టిపల్లి ప్రజలు తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పలు ప్రాంతాలకు తరలింపు
కాగ్నా నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్, మల్కాన్గిరి, రెడ్డిఘనాపూర్ తోపాటు తాండూరు పట్టణానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.5వేల వర కు విక్రయిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
హైకోర్టు స్టే ఉన్నా..
గోనూర్, వీర్శెట్టిపల్లి గ్రామాల శివారులోని కాగ్నా వాగు నుంచి ఇసుక అరలింపునకు అనుమతి ఇవ్వరాదని కొన్నేళ్ల క్రితం హైకోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఇవ్వడం లేదు. కానీ అక్రమార్కులు ఇవేవీ లెక్క చేయడం లేదు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా సాగిస్తున్నారు. జిల్లా అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించి కట్టడి చేయాలని ఆ రెండు గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. లేకుంటే భూ గర్భజలాలకు ముప్పు తప్పదని వారు పేర్కొన్నారు.
అనుమతి లేదు
గోనూర్, వీర్శెట్టిపల్లి గ్రా మాల శివారులోని కాగ్నా నది నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వడం లేదు. పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తున్నట్లుమా దృష్టికి వచ్చింది. ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం. సిబ్బంది కొరత కారణంగా తనిఖీ చేపట్టలేకపోతున్నాం. ఇసుక అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తాం.
– తారాసింగ్, తహసీల్దార్, తాండూరు