
‘రైతు నేస్తం’ను సద్వినియోగం చేసుకోండి
● అడిషనల్ కలెక్టర్ సుధీర్
మోమిన్పేట: రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అన్నదాతలకు పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ సుధీర్ తెలిపారు. సోమవారం మండలంలోని మేకవనంపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో మోమిన్పేటలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించే వారమని దీన్ని మరో రెండు చోట్ల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. సేంద్రియ ఎరువుల వాడకంపెంచాలన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకుడు సురేందర్, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రవీందర్,ఏఓ జయశంకర్, ఏఈఓలు పెంటయ్య, శ్రీనివాస్, చంద్రిక, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటాం
కొడంగల్: రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటామని.. వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ్తో కలిసి సోమ వారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలోని రావులపల్లి, చిట్లపల్లి, పర్సాపూర్ గ్రామాల రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్స్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వానాకాలం 2025 సీజన్కు సంబంధించి రైతు భరోసా అందిస్తామని మంత్రులు పేర్కొన్నారు. వివిధ పథకాల ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి (జిల్లా అటవీ శాఖాధికారి) జ్ఞానేశ్వర్, తహసీల్దార్ విజయ్కుమార్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, ఎంపీడీఓ ఉషశ్రీ, మండల వ్యవసాయాధికారి తులసీ, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.